తాడ్వాయి, వెలుగు: సమ్మక్క సారలమ్మ జాతరకు వీఐపీ వాహనాలు వచ్చే రహదారి, వీఐపీ పార్కింగ్ స్థలం, మేడారం తాత్కాలిక ఆర్టీసీ బస్టాండ్ ప్రాంగణాన్ని సీఎం కార్యాలయ ప్రిన్సిపల్ సెక్రటరీ కె.ఎస్.శ్రీనివాసరాజు గురువారం పరిశీలించారు. జాతర సందర్భంగా తాడ్వాయి టు మేడారం మార్గంలో భారీగా రద్దీ సమస్య ఏర్పడడంపై ఆయన ఆరా తీశారు.
ఈ సందర్భంగా అధికారులతో మాట్లాడుతూ.. జాతర సమయంలో వీఐపీ వాహనాల రాకపోకల్లో ఏర్పడే సమస్యలను గుర్తించి, ముందుగానే నివారణ చర్యలు చేపట్టాలని సూచించారు. 2026 మహాజాతర అనుభవాలను, పొరపాట్లను దృష్టిలో ఉంచుకొని, 2028 జాతరలో ఇబ్బందులు పునరావృతం కాకుండా పకడ్బందీ ప్రణాళికలు రూపొందించి ప్రభుత్వానికి సమర్పించాలని ఆదేశించారు.
వచ్చే జాతరలో భక్తులకు మరింత మెరుగైన సౌకర్యాలు కల్పించేందుకు ప్రభుత్వం ఇప్పటినుంచే ప్రత్యేక ఏర్పాట్లు చేస్తోందన్నారు. జాతర విజయవంతానికి కృషి చేసిన అధికారులను అభినందించారు. ఆయన వెంట జిల్లా కలెక్టర్ దివాకర టి.ఎస్, ఎస్పీ సుధీర్ రామ్ నాథ్ కేకన్ ఉన్నారు.
